Pages

14 October 2020

శ్రీ శ్రీ శ్రీ రాజ రాజ కవిశేఖరా ! నీకెందుకయ్యా ఈ కవిత్వం ? : Abdul Rajahussain

 

వుల‌ మీద,కవిత్వం మీద కె.భాస్కర్ సంధించిన వ్యంగ్యాస్త్రాలు !!

కె.భాస్కర్ ను ఇన్నాళ్ళు ఎలా మిస్సయ్యానో తెలీదు.ప్రొఫైల్ లోకి వెళ్ళి చూశాక నా నిర్లక్ష్యానికి
నన్ను నేను తిట్టుకున్నాను.ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం నుంచి వచ్చాడీ కవి. కవిత్వ జవజీవాలు
బాగా తెలిసినవాడు.అందుకే కవులపై,కవిత్వం పై తనదైన శైలిలో అస్త్రాలు సంధించాడు.ఏది
కవిత్వం?ఏది కవిత్వం కాదు? ఎవరు కవి? ఎవరు కాదు.అన్న సందేహాల సందోహంలో ఈయన
రాసిన రెండు కవితలు నాకైతే పెద్ద రిలీఫ్ ఇచ్చాయి. రెండు కవితల్లో కవిత్వ ‘ విశ్వదర్శనం ‘
తోపాటు యువకవులకు మార్గనిర్దేశం చేయించాడు .మీరూ చదవండి.ముఖ్యంగా...మరీ ముఖ్యంగా
వర్థమాన కవులు తప్పకుండాచదవండి.మీకు నచ్చుతాయి .మీ చేయిపట్టుకొని ముందుకు నడిపిస్తాయి.‌
1.మొదటి కవిత.” నిస్తేజం “ !!
“ నీకెందుకోయీ, కవీ…. కవిత్వం
వదులుకోలేవటోయీ, నీవా పైత్యం.
వ్యాకరణాల టక్కు టమారం
వృత్తగంధీ వచనపు సొగసులు
వేల శైలులా కవితా శిల్పం
విభిన్న రీతుల కావ్య లక్షణం
గణాల, గుణాల గందరగోళం
చంధస్సు, యతి ప్రాసల గరళం.
తెలుసా నీకేమైనా ?
తొంగి చూసావా, అటు నీవెపుడైనా ?
నీకెందుకోయీ, కవీ,... కవిత్వం
వదులుకోలేవటోయీ, నీవా పైత్యం.
స్వప్నలోకపు స్వేచ్ఛాయానం
యధార్థజగత్తు దుఃఖపు గానం
కొట్టుకొచ్చిన సృజనాత్మక రాతలు
ఎత్తుగడలలా ఎత్తులలోన
కూరుకుపోయిన అసలు రహస్యం
ధగధగ మెరసే కవుల తలలకు
వెనకనవున్న ఎన్నో సొట్టలు
తెలుసా నీకేమైనా?
తొంగి చూసావా, అటు నీవెపుడైనా ?
నీకెందుకోయీ, కవీ.... కవిత్వం
వదులుకోలేవటోయీ, నీవా పైత్యం.
హెర్బర్ట్ రీడు సర్రయలిజం
అధివాస్తవికత అయోమయం
కొత్తపుంతల ప్రాహ్లాద కవిత్వం
క్రోపాట్కిన్ అనార్కిజం
బుఖారిన్ చారిత్రక బౌతికవాదం
విశాల విశ్వపు సిద్ధాంతాలు
పిచ్చెక్కించే పదబంధాలు
తెలుసా నీకేమైనా?
తొంగి చూసావా, అటు నీవెపుడైనా?
నీకెందుకోయీ, కవీ,... కవిత్వం
వదులుకోలేవటోయి, నీవా పైత్యం.
కవుల గుంపులా కుళ్లు అసూయలు
కృత్రిమ వెలుగుల చీకటిరాజ్యం
విమర్శకత్తుల కరాళ నృత్యం
తోటి కవులను తొక్కేసే వైనం
ప్రచురణకర్తల కళావిలాపం
మిగిలిపోయినా కట్టలగుట్టలు
ఫుట్ పాతుకి చేరే విషాదసత్యం
తెలుసా నీకేమైనా?
తొంగి చూసావా, అటు నీవెపుడైనా?
జీవితకాలపు వ్యర్ధప్రయత్నం
ఎందుకు నీకీ అమాయకత్వం
సిద్ధించదులే నీకమరత్వం.
నీకెందుకోయీ, కవీ.... ఆ కవిత్వం
వదలుకోలేవటోయీ, నీవా పైత్యం.
ఓరకంగా ఇది వ్యంగ్య రచనే.కవులకు కవిత్వం ఎందుకంటూ ప్రశ్నించడం వెనుక ఆంతర్యం
కవిత్వ నిజ సందర్శనం చేయించడమే.కవీ....నీకెందుకయ్యా ఈ కవిత్వం? ఎందుకయ్యా
ఈ పైత్యం? కవిత్వం అంటే మాటలా? అబ్బో ! వ్యాకరణాల టక్కుటమారం తెలిసుండాలి.
వృత్తాల సొగసులు,శైలి,కవితా శిల్పం,విభిన్న రీతుల కావ్య లక్షణాలు,గుణాల,గణాల గందర
గోళం, ఛందస్సు,యతుల గరళం ఒక్కటా, రెండా ఎన్నో లక్ష్య లక్షణాల సమన్వితం కవిత్వం.
మర కవిత్వం రాసే వాళ్ళు వీటి వంక ఎవరైనా తొంగి చూశారా? లేక చూడకుండానే కవిత్వం
రాస్తున్నారా? కొత్త పుంతల ప్రాహ్లాద కవిత్వం,
ఇవేనా? ఇంకా వున్నాయి.రియలిజం,సర్రియలిజం,అథివాస్తవికత అయోమయం,అనార్కిజం,
చారిత్రక భౌతిక వాదం,విశాల విశ్వపు సిద్ధాంతాలు,పిచ్చెక్కించే పదబంధాలతో నీకు పరిచయం
వుందా? లేక వీటితో పరిచయం లేకుండానే కవిత్వం రాస్తున్నావా?
ఇంకా..ఇంకా..అవే స్వప్నలోకపు స్వేచ్ఛాయానం,యదార్థ జగత్తు దుఃఖపు గానం,సృజనాత్మక
రచనలు,ఎత్తుగడలు,ఎత్తులలో కూరుకుపోవడం,ధగధగ మెరిసే కవుల తలలకు వెనుక వుండే
సొట్టలు తెలుసా? ఎప్పుడైనా వీటిని వీక్షించారా? లేక అనుభవంలోకా తెచ్చుకున్నారా?
అది సరే కానీ ..కవిలోకంలో కుళ్ళును ఎప్పుడైనా చూశావా?విశ్వాన్ని దర్శించే కవి ఈసునసూయ
లతో సతమతం కావడం ఎప్పుడైనా నీ అనుభవంలోకొచ్చిందా? కృత్రిమశవెలుగుల చీకటి రాజ్యం
విమర్శ కత్తుల కరాళ నృత్యం నీకు ఎదురై వుండాలే.తోటి కవుల్ని తొక్కే వైనం,ప్రచురణ కర్తల కళా
విలాపం.మిగిలిపోయిన కట్టల గుట్టల కవిత్వం ఫుట్ పాత్ లకు చేరే విషాద సత్యం నీకు తెలుసా ?
ఇంత చిందర వందర గందరగోళాల మధ్య కవీ‌! నీకీ కవిత్వం ఎందుకయ్యా? కవిత్వాన్ని పట్టుకొని
వేలాడితే అమరత్వం ఏం సిద్ధించదు. మరెందుకయ్యా! ఈ కవిత్వం మీద నీకంత పిచ్చి.పైత్యం?
ఈ కవితలో కవిత్వం ఎంత కష్టమైందో? ఈ ముళ్ళబాటను తొక్కుకుంటూ కవిత్వం రాసి కవి అని
పించుకోవాల్సిన అవసరం వుందా? అన్నది భాస్కర్ ప్రశ్న.అయితే ఇంత కష్టపడుతూ కూడా కవులు
కవిత్వం రాస్తున్నారు.వారి రచనల వెనుక ఎంత విషాదం వున్నా భరిస్తూ కవిత్వాన్ని పట్టుకొని
వేలాడుతున్న కవుల గురించి న ప్రశంసా వున్నాయి.అలాగే కవిత్వం గందరగోళమే కాదు..కవిలోకంలో
వున్న ఈర్ష్య,అసూయ కుళ్ళు,ఎదుటి వాడిని తొక్కేయాలన్న దుర్మార్గాన్ని బయటపెట్టి ఎండగట్టాడు.
ఇక కవిత్వం రాసే కవిపడే పాట్లను భాస్కర్ మరో కవితలో ఎలా తెలుపుతున్నారోచూద్దాం!
*రా(త)దారి
రాసేదంతా కవిత్వమేనా అని సందేహమెందుకు
కాకపోనూవచ్చు, భయమెందుకు మిత్రమా !
ఉబికి వచ్చే అక్షరాన్ని
గొంతు నులిమి, అనుమానంతో
అనవసరంగా చంపడం ఎందుకు ?
తరువాత తీరిగ్గాఏడవడమూ ఎందుకు ?
భావాలతో అక్షరాలకులంకె కుదరక
కనెక్టివిటి కోసంగిలగిలలాడుతున్నావా ?
అదే ఓ కవి జననమని గుర్తుంచుకో నేస్తమా!
బొడ్డూడని బిడ్డ బాధ
ఏ ఎదిగినోడికీ అర్థమూ కాదు.
తలనెరిసినవాడి తాత్వికత
పురిటి కంపును ఆపనూలేదు.
దేనికవే సమాంతరాలు,అటునుంచి ఇటు దూకేదాక.
కళ్లూ చెవులే కాదు, ఇక్కడ పనిచేయాల్సింది
నిన్ను నువ్వు తెరుచుకోవాలి.
లోపలి అగాధాలలో అన్వేషించుకోవాలి.
ఒక్కో వాక్యాన్ని వలవేసి చేజిక్కించుకోవాలి.
నిర్భయంగా అక్షరమైపో, అజరామరమై మిగలడానికి.
నిలకడగా రాసుకుపో, నువ్వు నువ్వుగా నిలబడటానికి.
అది చాలు కవిత్వానికి.
ఇక వ్యాఖ్యలంటావా ?
పైకి లాగే వాడే పామై కరవావచ్చు
క్రిందికి నెట్టేవాడే, నిచ్చెనై మిగలావచ్చు.
కవిగా మిగుల్తావో,కనుమరుగైపోతావో
అది మరో పార్శ్వం.
కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే గొప్ప కళ
కవిగా మిగలడమూ, వెలగడమూ.
కవి రాసేదంతా కవిత్వం కావచ్చు.కాకపోనూ వచ్చు.అయితే తాను రాసేది కవిత్వం కాదని
తెలుసుకున్నప్పుడు మాత్రం నిరుత్సాహ పడాల్సిన పని లేదంటున్నాడు భాస్కర్. కవిత్వం
కాదన్న సందేహంతో ఉబికొచ్చే అక్షరాన్ని గొంతు నులిమి చంపొద్దంటున్నాడు.ఒక వేళ
రాసింది కవిత్వమేనని తెలిశాక బాధపడి ప్రయోజనం వుండదంటున్నాడు.
భావాలతో అక్షరాలకు లంకె కుదరక సతమతమవుతూ ,కనెక్టివిటీ కోసం గిలగిల్లాడటం అంటే
అదే కవికి “నిజమైన జననం” అని గుర్తించుకోమంటున్నాడు. కొత్త కవులంటే పాత కవులకు.జూనియర్లంటే సీనియర్లకు ఎప్పుడూ అలుసే.అయితే బొడ్డూడని బిడ్డ బాధ..ఎదిగిన వాళ్ళకెలాతెలుస్తుందంటున్నాడు.కొత్త కవికి పురిటి కష్టాలు తప్పవన్నది భాస్కర్ అభిప్రాయం.అయినా
తలపండిన వాడికీ,తల నెరిసిన వాడికి పురిటి వాసన ఎలా తెలుస్తుంది? ఎంత పెద్ద కవైనా..
ఆరంభంలో తప్పటడుగులు వేసిన పసివాడే అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలంటున్నాడు.
మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో?
మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరమన్న
సామెతను ఓ సారి గుర్తు తెచ్చుకుంటే ఈ శషభిషలకు తావుండదంటున్నాడు.ఎవరూ పుట్టుకతోనే బిరియాని తినరు.అన్నప్రాశన,వంటి లాంఛనాలు పూర్తికావాల్సి వుంటుంది.ఆ తర్వాత
పళ్ళొచ్చి,బిరియానీని జీర్ణం చేసుకునే వయసూ,
శక్తి రావాలి.అలాగే కవుల ఎదుగుదలకూడా
అనుభవాన్ని బట్టి వుంటుంది.ప్రారంభంలోనే గొప్పకవిత్వం ఆశించడంలో అర్థం లేదన్నది
భాస్కర్ అభిప్రాయం.చెట్టునుబట్టే గాలి,..
ఎదుగుదలనుబట్టే కవిత్వమూ పండుతుంది.
కవిత్వం రాయడానికి కళ్ళూ చెవులూ‌మాత్రమే పనిచేస్తే సరిపోదు.నిన్ను నీవు తెరుచుకోవాలి.
తెలుసుకోవాలంటున్నాడు భాస్కర్.లోపలి అగాధాల్ని అన్వేషించి,ఒక్కో వాక్యాన్ని వలవేసి
నేర్పుగా పట్టుకోవాలి. అప్పుడే అక్షరాలు కవిత్వమవుతాయి.కావల్సింది ధైర్యంగా,నిర్భయంగా
రాయడమే.అప్పుడే అక్షరం కవిత్వంలో స్నానం చేసి అజరామరమై నిలిచిపోతుంది.నిర్భయంగా,
నిస్సందేహంగా రాసుకుపోతుంటే నువ్వు నువ్వుగా నిలబడతావు.అదే కవిత్వం అవుతుంది.
ఇక కవిత్వం పై వ్యాఖ్యలూ,విమర్శలు సరేసరి.ఈ లోకంలో పైకి పోయేవాడ్ని కిందకు లాగే వాడుంటాడు.
అలాగే పైకి లాగుతూ కూడా పామై కరిచేవాడూ వుంటాడు.ఒక్కోసారి కిందకు నెట్టేవాడే నిచ్చెనలా ఉపయోగపడవచ్చు.ఇన్ని జరిగాక కూడా కవిగా నిలబడటం,లేక కనుమరుగై పోవడం అది వేరే విషయం.
రాసేవాళ్ళంతా కవులు కారా? అంటే అది వారి నిబద్ధతపై ఆధారపడి వుంటుంది. నిజానికి కవిత్వమవడం
కొద్దిమందికి మాత్రమే తెలిసిన విద్య.కవిగా మిగలడం,కవిగా వెలగడం కొందరికి మాత్రమే సాధ్యమయ్యే గొప్ప కళ.
మొదటి కవితలో కవిత్వంలోని శషభిషలు చెప్పాడు.రెండో కవితలో కవిగా ఎలా ఎదగాలో,
నిలబడాలో చెప్పారు. భాస్కర్.ఈ రెండు కవితల సారాన్ని సమన్వయించుకుంటే ముఖ్యంగా వర్థమాన కవులకుఎంచక్కా చుక్కానిలా ఉపయోగపడుతుంది.
భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తుంది.!!
**
ఎ.రజాహుస్సేన్..!!

ఆమెలో.... ఆమెతో...ఆమె లా..ఆమె కోసం. : ANIL DYANI

మనం అనుకున్నది అనుకున్నట్టు జీవించడం ఒక పద్ధతి.అలాగే మన పద్ధతి కి అనుకూలంగా ఎదుటి వ్యక్తులు జీవించాలి అని ఆలోచించే విధానం కూడ ఒక పద్ధతి,అయితే అలా ఉండమని చెప్పేటువంటి సందర్భంతోనే ఇబ్బందులు వస్తాయి.నువ్వు నిజం అనుకుంటున్నది ఎందుకు నిజమో చెప్పాలి,అవతలి వ్యక్తి అందుకు ఒప్పుకోవాలి. ఈ మధ్యలో వాదాలు ప్రతి వాదాలు తర్కం ఇలా చాలా రావొచ్చు.వచ్చినప్పటికీ మనం మన భావన మీదనే నిలబడి ఇంకా గట్టిగా మాట్లాడుతూ ఉంటే అది మనలో మనం నమ్మిన సిద్ధాంతం మీద మరింత నమ్మకాన్ని పెంచుతుంది.

మన సాహిత్యం లో విభిన్న కోణాల్లో జీవితాన్ని నిర్వచించి తమ తమ అభిప్రాయాల్ని సాహిత్యం ద్వారా వెల్లడించిన అనేకానేక సంఘటనలు ఉన్నాయి. వేమన తాను చూసిన లోకాన్ని అనుభవించిన జీవితాన్ని,ప్రజలకి అవసరమైన జీవన విధానాన్ని కొన్ని చిన్న చిన్న పాదాల ఖండికల రూపంలో చెప్పాడు.ఆఖర్లో జనం ఎవరూ వినరేమో అని తనకి తానే ఒక పాదం లో తనపేరు పెట్టుకుని అంతా తనకే చెప్పుకున్నాడు.తనమీద తనకి నమ్మకం లేక కాదు అదో పద్ధతి అంతే. ముందు తాను నమ్మిన సిద్ధాంతాన్ని తానే పూర్తిగా నమ్ముతున్నట్టు విశ్వాసం కలిగించే ప్రక్రియ అది.తెలుగు సాహిత్యం లో ఈ రోజున అది ఒక ఎన్నదగిన శతకం.
ఈ రోజున మనం జీవిస్తున్న ప్రపంచం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది.గంట గంట కి ఒక కొత్త ఒరవడి వస్తుంది.అనేక దేశాల ప్రభావం జీవన స్థితి గతుల్లో మార్పు.భౌతిక వాంఛల పట్ల వ్యామోహం పెరగడం.ప్రాపంచిక విషయాల్లో కొత్త కొత్త వ్యక్తీకరణలని తమ తమ జీవితాల్లోకి తీసుకోవడం. పని వత్తిడో లేక జీవన విధానం నచ్చి నచ్చక పోవడం ,ఆధ్యాత్మిక వాదుల పెరుగుదల,ప్రజల పట్ల వారి భయాందోళనలు ఇలా ఒకటేమిటి మనిషి తాను బతుకుతున్న అన్ని కోణాల్లోనుంచి అలా కొత్త మాటనో లేక వికాసాన్నో కోరుకుంటున్నాడు ,లేదా అందుకుంటున్నాడు వీటిల్లోనే మళ్ళీ తనను తాను వ్యతిరేకించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి.ఈ సంధిగ్దత ఎప్పటికి విడిచిపోదు.దీనికి మందు ఒక్కటే రెండు వైపులనుంచి ఆలోచన చేసి ఒక మధ్యే మార్గాన్ని చెప్పి అందులో సమస్యని దాని పరిష్కారాన్ని ఇస్తే అది కాస్త ఉపశమనం ఇస్తుంది అలా ఇచ్చే ప్రయత్నంలో రాయబడినవే ఈ "బేకారీలు"
బేకారీలు అనగా నేమి ఇరవై మార్కుల ప్రశ్న. లోతైన ప్రశ్న పెట్టడానికి చాలా సరదాగా పెట్టారు గాని పేరుకి తగినట్టు ఇవి అంత తెలికైనవి కావు,చాలా గొప్పవి మనం.మాట్లాడుకోదగినవి.వీటిల్లో "ఆమె" కథా నాయకుడు, మూల సూత్రం అంతా ఆమె . అతను ఏదో ఒక భ్రమలో ఉంటాడు.నిజం ని చూసి అబద్దం అనుకుంటాడు,అబద్దాన్ని నిజం అనుకుంటాడు.ఏదీ లోతుగా వెళ్ళడు అంతా గాలి వాటం ఏది పైకి మెరుగ్గా అనిపిస్తుంది అని అనుకుంటే దానిలోకి వెళతాడు.దాని వెనక ఉండే లాభనష్టాలు అతనికి పట్టవు. తద్వారా అతను చిక్కుల్లో పడతాడు ఆ పడటం అనేది అతని యొక్క ఉనికికి ప్రమాదం అవుతుంది.ఈమె అతణ్ణి సరిదిద్దే పని పెట్టుకుంటుంది.
ఇది దీర్ఘ కావ్యం కాదు,అలా అని మామూలుగా ఒక తెల్లకాగితం మీద రాసేసిన కవిత కూడా కాదు .ఇవి కొన్ని ఆలోచనల సమాహారం.ఇది సరైన భాగాహారం, ఇదో మేలుకొలుపు, జబ్బు ఏంటో తెలియని వాడికి ఎక్కడో అనుకోకుండా దొరికే ఔషధం.ఈ క్రింది పాదాలను చదవండి ఒక్కసారి.
"మనుషుల్ని ప్రేమిస్తూనే ఉండాలి
అమయకత్వానికి జాలిపడ్డా
మూర్ఖత్వానికి సిగ్గు పడ్డా
అహంకారంతో అణచబడ్డా
జ్ఞానానికి గర్వ పడ్డా
ద్వేషానికి గాయపడ్డా
మరిచిపోకు,మనుషుల్ని ప్రేమిస్తూనే ఉండాలి అంటుందామె,
పాలిండ్లని కొరికిన పసిబిడ్డను
పక్కకు తీసి,ప్రేమతో గుండెలకు హత్తుకుంటూ".
"కన్నతల్లి ప్రేమకన్నా అన్నమేది పాపలకి" అంటాడు వేటూరి ఒక పాటలో ఈ లోకంలో దేన్ని ప్రేమతో పోల్చాలి అన్నా సరే అది ఖచ్చితంగా తల్లి ప్రేమతో పోల్చాల్సిందే అందుకే ఇక్కడ ఆమె తనని తాను పోల్చుకుంటుంది.నువ్వు ఎన్ని నిందలు పడినా, గాయపడిన,లేక ఇతరుల వల్ల అవమానపడినా సరే నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా నీ ప్రేమని వదలొద్దు తల్లి పాలిచ్చే స్థితిలో ఉన్నప్పుడు తానెంత హింస పడుతున్నా దాన్ని అలవాటుగా మార్చుకుని తన రోజూవారి పనుల్లోకి మళ్ళీ అలవాటుగా వెళ్లి పోవడం మనమూ నేర్చుకోవాలని చెప్పడం చాలా బావుంటుంది.నిజానికి మన కళ్ళ ముందు ఎన్నో ఉదాహరణలు ఉంటాయి కానీ మనం చూడం,చూసినా మనం అన్వయించుకోలేము అలాంటి సందర్భంలో మనకి కాస్త ఇలాంటి వాక్యాల అవసరం ఉంటుంది. సాహిత్యం ప్రాపంచిక జ్ఞానంతో పాటుగా మానసిక విజ్ఞానం కూడా పెంచుతుంది.ఈ బెకారీల్లో ఆమె కూడా అదే నేర్పుతుంది.
"అతనొక వజ్రాన్ని కొన్నాడు
గదంతా కాంతి పరచుకుంది
ఆమె ఒక వాక్యాన్ని కనుగొన్నది
జీవితం ప్రకాశవంతమైంది
నిజమే,వాక్యపు వెలుగు వజ్రానికెప్పుడూ రాదు."
ఇది మరో ఆణిముత్యం. ఎన్ని మిణుగురు పురుగుల వెలుతురు వెన్నెల కి సమానం .ఎంత ఎగిరినా అక్కడక్కడ ఉంటూ వెలుతురు పంచే మిణుగురులు కాంతినివ్వలేవు.అలాగే ఎన్ని వజ్రాలు ఉన్నా వాటి వెలుతురు ఒక్క వాక్యపు వెలుగుతో సమానం కాదు కదా. ఇది పై పై వాక్యాలు గా చూస్తే కనుక భౌతికంగా వెలిగేది వజ్రం వెలుతురులో చూస్తే వజ్రం అందాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు కానీ,బుద్ధి వెలిగించే ఒక్క వాక్యము దాన్ని మించిన రెట్టింపు కాంతితో వెలుగుతుంది.అది బయటకి కనబడకపోయినా సరే ఎవరికి వారికి స్వానుభవం లోకి వస్తే తెలుస్తుంది.అదే ఇక్కడ కవి చెబుతున్నాడు నీలో వెలిగే వాక్యం అది నిన్ను చీకటిలోనుంచి వెలుగులోకి తీసుకుపోతుంది అక్కడ నీకు నువ్వు కనబడొచ్చు,లేదా సమాజంలో కుళ్లు కనబడొచ్చు లేదా నీ చుట్టూ చూడని సమాజాన్ని నువ్వు చూడోచ్చు. అలా చూడడం కూడా అలా విద్య కదా.అది మనం ఆచరణలోకి తెచ్చినప్పుడు మనం కోరుకున్న ప్రపంచం మనముందు కనబడుతుంది.కానీ ఇది అంత తేలిగ్గా సాధ్యమయ్యేది కాదు.ఆచరణ కావాలి అలవాటుగా చేసుకుంటూ పోయేది కాదు.
"ఎందుకనోయ్ గొప్ప వ్యక్తులకు
దూరంగానే ఉండమంటావు, అసహనంగా అడిగాడతను
కాస్తంత దూరం నుంచి వెలిగించు కుంటేనే
నువ్వూ, ఓ దీపమై వెలుగుతావ్
లేకుంటే,ఆ గొప్ప మంటలో భాగమవుతావ్
అంటుందామె,చలి ఉదయాన పొయ్యి రాజేస్తూ"
ఇక్కడ ఆమె రాజేసింది పొయ్యి కాదు. మెడదనే నెగడు. మనిషికి మనిషే మిత్రుడు,ప్రేమికుడు,స్నేహితుడు,శ్రేయస్సు కోరేవాడు, కొండకచో శత్రువు కూడాను. ఆమె జీవితాన్ని మొత్తం చూసింది కాబట్టే అతనితో ఇలాంటి మాట చెబుతుంది. ఎవరైనా సరే నువ్వు వారికి దూరంగా ఉండు. దగ్గరకి పోతే వారి అసామాన్య వెలుగులో నువ్వు కలిసిపోయి నీ ఉనికి ని పోగొట్టుకుని సామాన్య వ్యక్తిగా మిగిలి పోతావు, అదే దూరంగా ఉంటూ ఆ వెలుగులో నిన్ను నువ్వు సరిదిద్దుకుని సానబెట్టుకుంటే నీకోక అస్తిత్వం ఉంటుంది.నిన్నూ నలుగురూ గుర్తిస్తారు అంటుంది ఆమె.నిజమే కదా రోజు వారి సహవాసాల్లో ఎన్ని పగుళ్ళు చూస్తున్నాం,ఎన్ని మనస్పర్థలు చూస్తున్నాం,ఎన్ని వింటున్నాం అన్ని మన చుట్టున్న మనుషుల మధ్యనే కదా .అందుకే మనం మనపని చూసుకుంటూ సాధ్యమైనంత దూరం గా ఉంటే కావాల్సినప్పుడు కలవొచ్చు,మనకి అంతగా కలవనప్పుడు దూరంగానూ ఉండొచ్చు. కాబట్టి అతనే కాదు మనమూ ఆమె మాట పాటించవచ్చు.అది ఆరోగ్యానికి చాలా మంచిది కూడానూ.
"వాడు కత్తి పట్టుకున్నాడు - తప్పలేదు
కాస్త ఆలస్యంమైనా
వీడూ కత్తినే చేపట్టాడు-తప్పులేదు
వాడు కులం కార్డునో,మతం మత్తునో
ఆయుధంగా మలుచుకున్నప్పుడు తప్పదు-
వీడు దాన్నే ఆశ్రయిస్తాడు తప్పుకాదు
కావాలంటే ఏ చరిత్ర అయినా చదువుకో అంటుందామె,కాస్తంత విరక్తి గా చూస్తూ".
ఆమె విరక్తి కి చాలా అర్ధం ఉంది.అందులో ప్రపంచ చరిత్ర ఉంది,అందులోనే మన ఊరి రాజకీయం ఉంది,మనలో చాలా మంది దుఃఖం ఉంది,బాధ అక్షరం నిండా పరుచుకుని ఉంది.ఎంత బాధ ఆమెకి మనిషి ,మనిషి మధ్య కులం గోడలు మొలిచి మతం కత్తులు యుద్ధంకోసం పరితపిస్తూ ఉంటే ఆమె విరక్తి గా కాక ఎలా ఉంటుంది. నిజమే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అణా మహా కవి మాటలు ఇక్కడ కూడా స్ఫురణకు వస్తాయి .ప్రపంచ చరిత్రలో సగం యుద్దాలు కీర్తి కోసమే అయితే మిగతా సగం మతం వ్యాప్తికి జరిగాయి.ఇప్పుడు అవే యుద్దాలు మత ప్రాతిపదికన మన చుట్టు జరుగుతూ ఉన్నాయి.ఉంటూనే ఉన్నాయి.వాటికి మనిషి మానసికంగా బానిస కావడం అనేది మరో ఐరనీ. మనిషి ప్రలోభాలకు చాలా సులభంగా లొంగిపోతాడు,అంతకన్నా తేలిగ్గా భక్తి కి లొంగుతాడు .భక్తికి లొంగేవాళ్ళ మెజారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.కాబట్టే మతం,కులం ఎన్నో ఏళ్లుగా మన మీద స్వారీ చేస్తున్నాయి.అదే ఆమె విరక్తి .దీనికి విరుగుడు మందు ఇప్పటికి రాదు మనుషుల్లో వాళ్ళంతట వాళ్లే మారితే తప్పా మరో అవకాశం లేని రుగ్మత అది చూద్దాం మనం ఆశావహులం కదా ఇప్పుడైనా ఒక విత్తనం నాటితే అది ఎప్పటికైనా ఫలితం ఇస్తుంది.కనీసం అప్పుడైనా ఆమె విరక్తి స్థానంలో కాస్త ఆనందం చూడొచ్చు.
"కత్తికి సానబెట్టు కోవడం కాన్ఫిడెన్స్
పిడికి కూడా పదును పెట్టుకోవడం
ఓవర్ కాన్ఫిడెన్స్ అంటుందామె
తెగిన అతని చేతులకి కట్టు కడుతూ"
ఆమె కి తెలియని విద్యే లేదు.అతను అంతటి అమాయకుడూ లేడు. అచ్చం మనలాగే. మనకి అన్ని తెలుసని మనమే హీరోలమని మనం వాదించే మాటలని బట్టి మనం మన గుర్తింపు కోరుకుంటాం, కానీ ఒక మాటకి రెండు ముఖాలుంటాయని ఒక ముఖం మాత్రమే చూస్తూ మనం మన వాదనని మొదలు పెడతాం.అది కూడా ఒక భావన ని నెత్తిన పెట్టుకొని మరీ మొదలు పెడతాం .దాని మొదలు చివర మనకి తెలియవు మనకి ఎక్కడో ఒక వేరు ముక్కో,ఆకు చివరి భాగమో కనబడుతుంది దాన్నే పట్టుకుని సప్త సముద్రాలు,జీవనదులూ ఈదుకుంటూ మనం వాదం చేసుకుంటూ పోతాం ఆమె అదే అంటుంది, బాబు నీది ఓవర్ కాన్ఫిడెన్స్ అని. నీకు తెలిసింది కొంత మాత్రమే తెలియవలసింది ఇంకా బోలెడంత ఉంది అని. ఈ సూత్రం నేటి సోషల్ మీడియా వీరులకి బాగా అన్వయించవచ్చు.రచయిత కి ఆ ఉద్దేశ్యం లేకపోవచ్చు కానీ ఈ బేకారిని చదివిన వారికీ మాత్రం ఇప్పటి వాస్తవ పరిస్థితికి అన్వయించుకోకుండా ఉండలేరు.ఇక్కడ అందరమూ ప్రవచన కారులమే కానీ సమస్య పరిష్కారం చూపలేని సిద్ధాంత కర్తలం ఆమె వీళ్ళందరిని చూసి పడీ పడీ నవ్వుతుంది అతను పిడి ని పదును పెట్టుకుంటూ ఉంటే.అతనిది మితి మీరిన ఆత్మ విశ్వాసం అని అతనికి కలిగిన దెబ్బలకి మందు పూసే ఆమెకి తెలుసు. అతనికి తెలియడానికే చాలా సమయం పడుతుంది.ఈలోగా అతని పేరు మీద చాలా దెబ్బలు,గాయాలు రాసిపెట్టి ఉంటాయి తెలుసుకునే సమయానికి అతనే తెలుసుకుంటాడు గాయపడ్డ ప్రతీసారి ఆమె ఎలాగూ మందు పూస్తుంది కదా.
ఈ పుస్తకం నిండా ఇలాంటివి 280 ఉన్నాయి.ఒకటి చదివి ఇంకోటి చదివేలోగా ఈ లోపు మొదట చదివింది లోపల గొడవ చేస్తుంది. చూడు ఇది నువ్వే అనుకుంటా అని కంగారు పెట్టిస్తుంది, మనం ఆలోచనలో పడిపోతాం మార్పు కోసం ఎదురు చూస్తాం.కొన్నిసార్లు నిస్సహాయులమై నిలబడిపోతాం ఎందుకంటే మనం ఇప్పటికి ఒక కుక్క తోకపట్టుకుని చాలా దూరం ఈదుకుంటూ వచ్చేస్తాం కానీ వెనక్కి పోవడానికి దారి వచ్చిన దారికంటే క్లిష్టంగా ఉంటుంది.అప్పుడు కూడా ఆమె నీకు అవసరమైన ఒక బేకారిని ఎక్కడో రాసిపెట్టే ఉంటుంది. కాబట్టి పుస్తకం అంతా చదవాలి.ఇది ఒక రహస్య నిధి ని వేటాడేందుకు అవసరమైన మ్యాప్ లాంటిది నీకు అవసరం అయిన అన్ని ఓకే చోట ఉండవు అక్కడొకటి ఇక్కడొకటి ఉంటాయి అన్ని అవసరం అయినవే, దేన్ని వదిలే వీలు లేదు,వదల్లేవు ఎందుకంటే రాబోయే నిధి నిన్ను ఊరిస్తూ ఉంటుంది కదా.ఈ పుస్తకము మొత్తాన్ని ఓకే ఒక మాటలో చెప్పే ప్రయత్నం చేశారు భాస్కర్.కె. నిజానికి అన్ని బెకారీల్లో ఆమె లేదు, ఆమె ఉన్న బేకారీలు మాత్రమే పబ్లికేషన్స్ వాళ్ళు తీసుకుని గుది గుచ్చిన పుష్పగుచ్చాన్ని మనకి అందించారు. అందుకు వారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
" నీ కిటికీ లోనుంచి ప్రపంచాన్ని చూడు
స్వతంత్రుడివి అవుతావు
నీ కిటికీనే ప్రపంచం అనుకుంటే
మూర్ఖుడివి అవుతావు"
ఇది సత్యం .ఇదే సత్యం. నేర్చుకోవాల్సింది,నేర్పాల్సినది.ఎవరికైనా ఎలాగైనా ఎక్కడైనా ఇదొక పాఠం గా బోధించాలి.
బహుశా ఎప్పటినుంచో చాలా ఈ ప్రపంచాన్ని అధ్యయనఁ చేసిఉంటారు భాస్కర్.ఈ భౌతికశాస్త్ర ప్రభుత్వ ఉపాధ్యాయుడు చాలా కవిత్వాన్ని రాశారు.రాసిన ప్రతీ వాక్యం చదివిన పాఠకుడిలో ఎక్కడో ఒక చోట గుచ్చుతుంది. బేకారీలు రాసినా,గుగాగీలు రాసినా అన్నింటిలో ఒక తాత్వికత, ఒక చిన్న చురక మరికొన్ని చోట్ల ఒక పెద్ద చెంప దెబ్బ కొట్టి గాని వదలరు.ఏది చేసినా ఆలోచనతో చేస్తారు. కవిత్వం ఎంత బాగా రాస్తారో అంతే బాగా ఫోటోగ్రఫీ చేయగలరు.ఈయన కన్ను చాలా ప్రత్యేకమైనది. ఈ బేకారీలు ఈయన రాసినా మూలం ఎక్కడా చెడిపోకుండా భావం మొత్తం ఆయన మాటలే వినబడేలా సంపాదకీయం చేశారు, పిన్నమనేని మృత్యుంజయరావు గారు, శ్రీ సుధా మోదుగు గార్లు ఇద్దరూ ఈ పుస్తకం సంపాదకులు .వాస్తవానికి ఇలాంటి పుస్తకాన్ని పట్టుకోవాలంటే కాస్త భయం ఉంటది కానీ వీళ్ళు మాత్రం దాన్ని చాలా ప్రేమగా హత్తుకున్నారు ఎక్కడ అతి అనిపించే వాక్యమో లేక మాటో కనబడదు.చాలా షార్ప్ ఎడిటింగ్ ఉంది వీళ్ళ ఆలోచనల్లో అదే పుస్తకం నిండా పరచుకుంది.భాస్కర్ గారి మొదటి కవితా సంపుటి "వాక్యం".ఎవరి పుస్తకం కి వారి ఫోటోనే ముఖచిత్రం గా వేసి ఒక ప్రయోగం చేశారు.దానికి ఏమాత్రం తీసిపోనిదీ పుస్తకం.ఇలాంటివి ఇతర భాషల్లోకి అనువాదం కావాలి.మన ఆలోచన బలం మిగతా ప్రాంతం వారికి కూడా తెలుస్తుంది. ఇలాంటివి రాస్తూ కవిత్వాన్ని కూడా కాస్త పట్టించుకోవడం వంటివి భాస్కర్ గారు చేయాల్సిన అవసరం ఉంది.ఆమె చాలా చోట్ల దారి తప్పినట్టు కనబడుతుంది కానీ తప్పి పోయింది ఆమె కాదు మనమే అందుకే ఆఖరి అట్ట మీద ఆఖరి మాటగా ఇలా అంటారు
" మార్పే సత్యం
తర్కమే జ్ఞానం
ప్రస్నే మార్గం
సత్యజ్ఞాన మార్గమే జీవితం"
కవి కోరిక నెరవేరు గాక.
కథనో,కవిత్వాన్నో కానుకగా పొందొచ్చు.కానీ జ్ఞానాన్నీ మాత్రం కొనుక్కోవాలి.ఈ పుస్తకం కొనుక్కుని చదవండి.

వాస్తవం, సత్యాల తాత్విక సమ్మేళనం - ఆమె : SRISUDHA MODUGU

'ఆమె' పుస్తకం చేస్తున్నప్పుడు మొదట జరిగే సెలక్షన్ లో భాగంగా, ఇందులో ప్రతి బేకారీ ఒకటికి రెండుసార్లు చదవడం జరిగింది, అలా చదువుతున్నప్పుడు
చాలాసార్లు ఈ కోట్ గుర్తొచ్చింది
'We know what we are, but know not what we maybe.'
పుస్తకం అతడు, ఆమె అనే ఒక వినూత్న ప్రక్రియతో మొదలవుతుంది. కొంత జాగ్రత్తగా పరిశీలిస్తే. అలా ఎన్నుకోవడం ఒక పరిపూర్ణత్వాన్ని సూచిస్తూ,ప్రకృతిలో స్త్రీ పురుషుడు విడదీయలేని భాగాలని , రెండు భిన్న పార్శ్వాలు, దృక్పధాలు, భిన్న హృదయాలని, వారిద్దరినీ కలుపుకుంటూ ముందుకు వెనక్కు వెళ్ళేదే లోకం, ఇంకా జీవితం అని చెపుతున్నట్లు అనిపిస్తుంది. అసలు పరిపూర్ణత్వమే ఒక అసంపూర్ణత్వం అనినవ్వుతూ చెప్పే ఆమె మనకి కనిపిస్తుంది.
ఆమె, అతడు ఇద్దర్ని సమానంగా పోటాపోటీగా వాళ్ళ స్థానాల్లో పాఠకులు దగ్గరికి తీసుకుంటారు అనిపిస్తది .
జీవితం, ప్రేమ, ఆలోచన, అవగాహన, వ్యక్తిత్వం ఇంకా చాలా అంశాలు ఇందులో తారసపడతాయ్. రచయిత పరిశీలనా శక్తి అబ్బురపరుస్తుంది. సందర్భానుసారంగా మారిపోయే వాస్తవాలను కాచి వడపోశారనిపిస్తది. సత్యం, నిజంలాంటి అంశాలు కాలాతీతంగా నిలుస్తాయా అన్నప్రశ్న మనకి మనమే వేసుకుంటాం. ఇలాంటివి చూస్తే లోతైన ఆలోచన, తాత్వికత వుంటే కానీ ఇలా రాయడం సాధ్యపడదు అనిపిస్తది.
భిన్నమైన మౌలిక అస్తిత్వ ప్రశ్నల్లో కూడా
అదృశ్య ఏకత్వాల వైపుగా
నీ దర్శనాన్ని కొనసాగించినప్పుడు
నీలాంటి ప్రపంచాలను
ప్రపంచంలాంటి నిన్ను
కోట్లసార్లు కలుసుకుంటావ్
ఓదార్చుకుంటూ తిరుగుతుంటావ్
ఏ వాదాలకు సమయం చిక్కనంతగా
నిజానికి, అంతకంటే ఏమిలేదిక్కడ
అంటుందామె, సెలయేరై సాగిపోతూ.
మనం దిగబడి, మనల్ని ఉచ్చులో బిగించే ఎన్నో అంశాలు ఎక్కడో తగిలి ఉలిక్కిపడేలా చేస్తాయి. ఆశ, మోహం, కీర్తి, కాంక్ష, అసూయ, స్వార్ధం, ద్వేషం చాలా అంశాలు. మనల్ని ఒక చూపు చూసి దాటెళ్ళి పోకుండా రగిలించి పోతాయి ఇలా
* అతనడిగాడు
నా ప్రతిభకు గుర్తింపేదని
ప్రతిభకైనా, దేహానికైనా
మోయడానికి కొన్ని భుజాలు కావాలి
నలుగురు మోసేటప్పుడు
దేహం ఎంత నిశ్చలంగా వుంటుందో
ప్రతిభకూడా అంత నిస్పర్శగా వుండగలిగనప్పుడే
కోరుకో దాన్ని, అంటుందామె
అతన్ని కఠినపరుస్తూ.
* వ్యక్తులను ప్రేమించే స్థాయినుంచి
వ్యవస్థలను ప్రేమించే స్థాయికి ఎదిగాడు వాడు
అన్నాడతను ఆరాధనగా
అవును, వ్యక్తులను వాడుకోవడంలో
మంచి అనుభవాన్ని సంపాదించాడు కదా, అందామె చిరాగ్గా.
కవి ప్రభావితం కాబడ్డవి ఎంత నిజాయితీగా బట్టబయలు చేస్తే ఆ అక్షరం అంత నిర్భీతిగా నిశ్చలంగా ఉదాత్తంగా నిలుస్తుంది. ఆకాశం లో ఎన్నో వేల నక్షత్రాల్లో, కొన్ని నక్షత్రాలు మరింత ప్రకాశవంతం గా మెరుస్తాయి. వాటి వెలుగులో దారి ఇంకా స్పష్టంగా కనపడుతుంది.
కొన్ని బేకారీలలో మనతో పాటు చింతించే, మనలాగే తాపత్రయపడే మామూలు మనిషి కనిపిస్తాడు. మనిషి బ్రతుకు చింత లో ఎదురయ్యే సామాన్య అనుభవాలను చిక్కించుకొని గుండెను మెలిపెట్టిన కష్టం తొంగి చూస్తుంది.
* నీది కాని సమస్యను నీ మెడకు చుట్టి
ఇక వెనక్కి తిరిగి కూడా చూడకుండా
నిన్ను వంటరిగా వదలివెళ్లిపోతాడే
వాడి కంటే గ్రేట్ఎస్కేపిస్ట్
ఎవరుంటారంటుందామె
కాస్తంత రుద్దమైన కంఠంతో.
నిజమే కదా అది ఎంత మామూలుగా జరిగే విషయం. మన రోజువారీ అనుభవాల్లో చాలా సామాన్యంగా తగులుతుంటారు నిన్ను సమస్యలోకి తోసి తప్పుకొనే ఇలాంటి వాళ్ళు
* దేవుడు మనిషికొక రక్షకతంత్రం
మనిషి దేవుడి అస్థిత్వ రక్షకుడు
ఏ హేతువూ వీళ్లను విడదీయలేదు
మనిషికి మతం ఉపశమనమై మిగిలినంతకాలం
కొంతమందికిదే బతుకుతెరువైనంతకాలం
అంటుందామె,
మతపు మరకను ఉతికే ప్రయత్నంలో
మరోసారి విఫలమవుతూ.
మతపు మరకను ఉతికే ప్రయత్నం అంట ,సామాన్యమైన పదంతో లోతు ని పలికే వాక్యం. అందులో కవి నిగూఢత తెలుస్తుంది మతం చేసిన మరక మనిషిపై ,దేవునిపై , మనిషి బతుకుపై .
* ఆమె దేవుడికి దండేసినందుకు
అతని నాస్తిక మనసు కుతకుతలాడిపోయింది
ఓ పది దండలతో ఇంటికొచ్చి
కవేరా, పీపీ, నోలం, ఆవో, బాలిన్ వగైరా
ఫోటోలను మాలలతో అలంకరించి
వాటి ముందు భక్తితో బోర్లాపడేదాకా.
నాస్తికత్వంలో వ్యక్తి పూజని నిలువునా ఖండించిన వాక్యాలు. ఇలాంటివి చాలా ఉంటాయి సంఘం పైన సూటి ప్రశ్నలు .
సంక్లిష్టంగాలేకుండా సరళంగా జీవించడమెంత అందం.
* పరమార్థాలు
చేయాల్సిన మహత్కార్యాలు
చూడాల్సిన లోకకళ్యాణాలు తెలుసుకొని
అటు నడవాలోయ్
లేకుంటే, ఇక జీవితమెందుకన్నాడతను
జీవితం జీవించడం కోసమే కాని
ఏదో సాధించుకోవడం కోసం కాదనుకుంటానోయ్
అంటుందామె ప్రకృతైపోతూ.
జీవితం జీవించడం కోసమే అనేది సాధారణంగా అనిపించే ఉన్నతమైన నిర్వచనం. ' ప్రకృతై పోతూ’,చాలా సహజత్వం ధ్వనించే విలువైన మాట. ఈ వాక్యాలలో ప్రతిపదం విలువైనదే. ఏదీ మాములుగా తీసుకోలేం.
సరళీకరించుకుంటూ, సంస్కరించుకుంటూ చివరిగా నేర్చుకుంటూ మనల్ని మనమో సారి తడుముకోనో తరిచి చూసుకొనో హా.. అనుకొనే ఆలోచనలో పడేసే పుస్తకం ఆమె.
బహుశా సామాన్య పాఠకుడికి కొంచం భిన్నమైన అంశం ఏదైనా ఉంటె కవులపైన, కవిత్వంపైన కవి చూపించిన ప్రేమాభిమాన ఇష్టాయిష్టాలు.
చదువుతుంటే అనిపించింది అవి కవులకే కాదు ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని. లోపల దాగిన మరో మనిషికే చెపుతున్నట్లు అనిపిస్తాయి.
అక్షరాల వలేసేకొని భుజాన నువ్వు
ఒక వ్యూహంతో కదులుతున్నప్పుడు
పెద్దపెద్ద చేపలనే కలలు కంటావు
ఆ చేపలే నీకేయబడిన ఎరలని
వాటి నోళ్లల్లో దాంకున్న పాములు
నీకు కనబడవని
నీకంటే ముందే మొదలెట్టి
ఈ వేటలో అవి రాటుదేలిపోయాయని
నీకంత త్వరగా అర్థం కాదు
ఎందుకంటే
నువ్విప్పుడే కదా ఈ ఆటలో అడుగెట్టింది
అత్యుత్సాహంతో ఫలహారమైపోకు వాటికి
అంటుందామె, అతని కలలతో తొక్కుడుబిళ్లాడుతూ
ప్రతిహేతు బద్దమైన ఆలోచన లోంచి హేతువు తీసివేసి జీవితాన్ని చూడాలనే తపన లోలోపల కనిపిస్తుంది. పుస్తకం ప్రేమ అనే అంశం తో మొదలు పెట్టి జ్ఞానతత్త్వంతో ముగించి ప్రపంచం పైన జీవితంపైన ప్రేమను విశ్వాసాన్ని నమ్మకాన్ని పదిల పరుచుకోవాలన్నట్లు అనిపిస్తుంది.
*ఇప్పుడు ఏమి దొరికింది ఏం మిగిలిందని
విస్తుపోతున్న అతన్ని చూసి
దొరకకపోవడం, మిగలకపోవడం లోనే
సంతోషముందేమోనయ్, అంటుందామె కొంటెగా.
ఇంత నిరాడంబరంగా నిర్భీతి వాక్యం రాయడం అందరికీ చేతవ్వదు. ఆమె పుస్తకం మనకి అందుబాటులో ఉన్న షెల్ఫ్ లో పెట్టుకొని ఏ పేజీ నుంచి చదివినా ఆసక్తిగా చదివించగలిగే పుస్తకం.
*జింకను, పులిని ఒకలాగే చూసే దృష్టిని
సమదృష్టి అనుకొని భ్రమపడుతుంటారు
వెర్రి జ్ఞానులు, అంటూ నవ్వుతుందామె
జింకపట్ల జింకలా, పులిపట్ల పులిలా ఉండటమే
సమస్థాయి దృష్టని మరిచి, అంటూ. .
ఇలాంటి ఆణిముత్యాలు పుస్తకం నిండా ఉంటాయి.
చెపుతూ వెళితే ప్రతి బేకారీ ప్రస్తావించాలి
నిర్దష్టతకు నిర్వచనం ఇచ్చుకోలేని క్షణం క్షణం మారుతున్న కాలానికి, పరిగెడుతున్న ప్రపంచంలో, ఇది నిజమా, అబద్దమా, సత్యమా, అసత్యమా అని లేకుండా,
ప్రపంచాన్ని , నిన్ను నువ్వు చూసుకొనే దృక్కోణం ఎన్ని విధాలుగా ఉంటుంది, ఎంత డ్రమటిక్ మారిపోతదో చెప్తూ జీవితాన్ని చూసే భిన్నంగా దృక్కోణాలని విభిన్నంగా వ్యక్తీకరించిన ప్రత్యేకమైన పుస్తకమిది.
సోక్రటీస్ కొటేషన్ ఒకటి ఉంది
I cannot teach anybody anything,
I can only make them think.
ఒక పుస్తకం మనలో ఆలోచన రేకెత్తించడం అనేది చేయగలిగిందంటే అది ఒక ప్రామాణికత ఉన్న పుస్తకం.
అందరికీ ఒక్కసారైనా తటస్థించి తారసపడాల్సిన, ఒక్కసారన్నా చదవాల్సిన పుస్తకం.
Don`t miss to read ‘ ఆమె '
మంచిపుస్తకం, సికిందరాబాద్ వాళ్ళ దగ్గర ఈ బుక్ దొరుకుతుంది .
చిత్రంలోని అంశాలు: 'ఆమె... బేకారీలు అజ్జానానికి జ్ఞానానికి మధ్య కొన్నిప్రశ్నలు ఉంటాయి ఎంతటి జ్ఞానికైనా కొన్ని ప్రశ్నలు మిగిలే ఉంటాయి. కిటికీలో నుంచి ప్రపంచాన్ని చూడు స్వతంత్రుడివి అవుతావు కిటికీనే ప్రపంచమనుకుంటే మూర్ణుడివి అవుతావు. ఆమె... మార్చే సత్యం తర్కమే క్ఞానం ప్రశ్నేమార్గం సత్యజ్ఞానమార్గమే జీవితం విజ్జానప్రచురణలు బేకారీలు' అని చెప్తున్న వచనం

ఆమెతో... - భాస్కర్ కే గారి 'బేకారీలు': SREENU BODDANI

 

నా మానాన నేను మా ఆవిడ వేసిన మాడిపోయిన మసాలా దోసె తిట్టుకుంటూ తింటూ ఎప్పుడు ఎలా చూసానో తెలియదు కానీ సరిగ్గా అదే సమయానికి (బహుశా ఎవరైనా కామన్ ప్రెండ్ కామెంట్ లేదా ట్యాగ్ ద్వారా అయ్యిండొచ్చు)
భాస్కర్ కె
గారు రాసిన 'బేకారీలు' అనే హెడ్డింగ్ తో కూడిన పట్టుమని ఎనిమిది నుంచి పది లైన్లు ఉన్న పోస్ట్ కనపడింది బహుశా ఓ సంవత్సరం లేదంటే అంతకన్నా ముందేనో కరెక్ట్ గా గుర్తుకు లేదు.
అయితే ఇక్కడ నాకు మొదటి ఆసక్తి ఎక్కడ కలిగింది అంటే 'బేకారీలు' అనే పదం దగ్గర. వాస్తవానికి ఈ పదాన్ని ఎక్కువగా నేను సాటి మనుషులను తిట్టే పదాలలో ఒకటిగా మాత్రమే విన్నా. సరే చూద్దాం అని పోస్ట్ చదవడం మొదలు పెట్టాక బలే అనిపించింది. పెద్దగా సుత్తి లేకుండా , చదివే వారికి ఇట్టే అర్థం అయ్యేలా ఉండడం నిజంగా గ్రేట్. ఇక 'ఆమె' దెప్పిపొడుపులు చూస్తుంటే నన్ను ప్రతి విషయంలో, ప్రతి సంధర్భంలో , ప్రతి రోజు నన్ను మా ఆవిడ తలంటినట్లే అనిపిస్తుంది చదివిన ప్రతి 'బేకారీలో'. బహుశా ఈ భావన నాకే కాదు ఈ 'బేకారీలు' చదివే ప్రతి ఒక్కరికీ అలాగే అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను.
అసలు మామూలుగా నేను కధలు, నవలలు ఎక్కువగా ఇష్టపడతా నా చిన్న వయస్సు నుండి కూడా. కవిత్వం అన్నా లైన్ లైన్ విడివిడిగా చదవడం అన్నా అసలు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ ఫేస్బుక్ లో ఓ ఐదు ఆరుగురివి మాత్రం ఆసక్తిగా చదువుతా. అలా వారిలో భాస్కర్ సర్ ఒకరు.
వాస్తవ జీవితానికి ఎంతో ఎంతో దగ్గరగా ఉండే మరియు రోజు వారి ప్రాపంచిక పరిస్థితులకు అనుగుణంగా రాయడం ఇందులో ప్రత్యేకత.
అతను ఏదో చేద్దాం అనుకోవడం , ఏదో ఆలోచించడం , ఎక్కడో బ్రమలలో తేలియాడడం, ఆ వెంటనే ఆమె అతనిని వాస్తవిక ప్రపంచం గురించి ఒకే మాటతో తుస్సుమనిపిస్తూ అతనిని తలంటడం బలే అనిపిస్తుంది.
*******
ఈ పరిచయ భాగ్యంలో భాగంగా ఈ పుస్తకంతో పాటు మరో మూడు పుస్తకాలను పంపించారు భాస్కర్ సర్ ముందు చెప్పకుండా సర్ప్రైజ్ చేస్తూ.
అలా 'బేకారీలు' పుస్తకం వచ్చింది నాకు. నిజంగా గ్రేట్ సర్ మీరు. ఎంతో బాగా రాసారు. పుస్తకం నాచేతికి వచ్చాక మీతో మాట్లాడడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కృతజ్ఞతలు సర్.
*****
ఒక్కోదాన్ని అతికించుకుంటూ
నిర్మించేది కాదు జీవితమంటే
ఉన్నవాటిని బద్దలు కొట్టుకుంటూ
పగిలిన శకలాల మధ్య నిరంతర వెతుకులాటే
అసలైన జీవితమని వ్యాఖ్యానించినప్పుడు
అపనమ్మకంగా అడుగుతాడు, అతను
నిజం చెబుతున్నావా నువ్వు, నిజంగా అని.
*****
అతను గొప్పవాడు తెలుసా అన్నాడతను
అవును, నిజమే
గుండెల్లో మాట పెదాలదాకా రాదు
పెదాలపై మాట గుండెలదాకా పోదు
మామూలు విషయమా అది
అంటుందామే, క్యాలీఫ్లవర్లో పురుగులను ఏరుతూ.
*****
ఇలా వేటికవే ఏంతో ఆసక్తి రేకెత్తించే 'బేకారీలు'.
బహుశా చిన్న నాటి నుండి పుస్తకాలు చదవడమే కానీ మొదటి సారి సమీక్ష రాస్తున్న.
****
శ్రీను బొద్దని.